హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి సోమవారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని మేనేజ్మెంట్లకు కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కౌముదీ ఆదేశించారు. పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు కేవలం రెండు షిఫ్టులకే సెలవులు పరిమితం చేస్తూ ఇటీవల కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సీఈఓ వికాస్ రాజ్కు లేఖ రాశారు.
నైట్ షిఫ్ట్ ఉన్న వారికి సెలవులు రద్దు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ సిటీకి దూరంగా ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన వికాస్ రాజ్.. అన్ని షిఫ్ట్ల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన కార్మిక శాఖ.. సోమవారం అన్ని షిఫ్టుల్లో పనిచేసే వారికి సెలవులు ఇవ్వాలని మేనేజ్మెంట్లను ఆదేశించింది.
